
గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు.
సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.
వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే…
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది